ఏపీలో పాముకాటుకు అంబులెన్స్లోనే వైద్యం..! తొలిసారిగా 108 వాహనాల్లో ఏఎస్వీ ఇంజక్షన్లు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పాముకాటు బాధితులకు సత్వర వైద్యం అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా 108 అంబులెన్స్లలో యాంటీ స్నేక్ వెనం (ఏఎస్వీ) ఇంజక్షన్లను అందుబాటులోకి తీసుకురానుంది.
పాముకాటు ఘటనలకు సంబంధించిన అత్యవసర కాల్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు.
పాముకాటు బాధితులకు అంబులెన్స్లోనే అవసరమైన ప్రాథమిక వైద్య చికిత్స అందించి, అనంతరం సమీపంలోని ఆసుపత్రికి తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. పాముకాటుకు గురైన వారికి సకాలంలో వైద్యం అందించాలన్న ప్రజల విజ్ఞప్తులపై స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో పాముకాటు బాధితులకు ఆసుపత్రికి చేరుకునేలోపే అత్యవసర వైద్య సహాయం అందించేందుకు ఈ చర్య ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.