ఏపీలో సర్పంచ్ ఎన్నికలపై బిగ్ అప్డేట్..
ఏపీలో సర్పంచ్ ఎన్నికలపై బిగ్ అప్డేట్.. అక్టోబర్లోపు స్థానిక ఎన్నికలు పూర్తి చేసే దిశగా కసరత్తు
అమరావతి, ఆగస్టు 1: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేగంగా సన్నాహాలు ప్రారంభించింది. ఎన్నికల ప్రక్రియను గడువులోపు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ నెల 6న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో వార్డుల విభజన, పెండింగ్లో ఉన్న కోర్టు కేసుల స్థితి, ఓటరు జాబితాల నవీకరణ, ఎన్నికల నిర్వహణకు అవసరమైన పరిపాలనా ఏర్పాట్లు, సిబ్బంది నియామకం, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఎన్నికలను దశలవారీగా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ముందుగా మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, చివరగా గ్రామ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
అన్ని ప్రక్రియలు అనుకున్న విధంగా పూర్తైతే అక్టోబర్ నెలాఖరులోపు రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిచేసే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఎన్నికల తేదీలపై తుది నిర్ణయం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారిక షెడ్యూల్ విడుదల చేసిన తర్వాతే స్పష్టత రానుంది. ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పరిపాలనా సన్నాహాలు వేగంగా కొనసాగుతున్నాయి.