ఏటీఎం తరహాలో స్మార్ట్ రేషన్ కార్డులు.. తెలంగాణలో త్వరలో పంపిణీ
ఏటీఎం తరహాలో స్మార్ట్ రేషన్ కార్డులు.. తెలంగాణలో త్వరలో పంపిణీ
హైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సాంకేతికంగా బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దకాలంగా వినియోగంలో ఉన్న కాగితపు రేషన్ కార్డుల స్థానంలో పీవీసీతో తయారు చేసిన ఏటీఎం తరహా స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెడుతోంది.
కొత్త స్మార్ట్ రేషన్ కార్డులపై కుటుంబ యజమాని ఫోటోతో పాటు ప్రత్యేక క్యూఆర్ కోడ్ ముద్రించి ఉంటుంది. దీంతో లబ్ధిదారుల వివరాలను డిజిటల్ విధానంలో వేగంగా ధృవీకరించడంతో పాటు నకిలీ కార్డులు, అక్రమాల నియంత్రణకు అవకాశం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల పౌరసరఫరాల కార్యాలయాలకు స్మార్ట్ కార్డులు చేరాయి. ప్రభుత్వం తుది మార్గదర్శకాలు జారీ చేసిన వెంటనే అర్హులైన లబ్ధిదారులకు వీటి పంపిణీ ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ స్మార్ట్ కార్డుల ద్వారా రేషన్ పంపిణీ ప్రక్రియ మరింత సులభతరం కావడంతో పాటు, లబ్ధిదారుల గుర్తింపు, డేటా నిర్వహణ, పారదర్శకతలో గణనీయమైన మెరుగుదల ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త విధానం అమల్లోకి రావడంతో ప్రజాపంపిణీ వ్యవస్థలో సాంకేతికతకు మరింత ప్రాధాన్యం లభించనుంది.