తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమలకు సింగపూర్ ఆసక్తి....
తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమలకు సింగపూర్ ఆసక్తి.. సీఎం రేవంత్ రెడ్డితో ప్రతినిధుల భేటీ
హైదరాబాద్:తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమల ఏర్పాటు కోసం సింగపూర్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సింగపూర్ మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ పర్మనెంట్ సెక్రటరీ ఆగస్టీన్ లీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని అసెంబ్లీలోని చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు.
తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, పరిశ్రమలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, వేగవంతమైన అనుమతుల వ్యవస్థ గురించి ముఖ్యమంత్రి ప్రతినిధులకు వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సహకారం అందించాలని కోరారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని స్పష్టం చేశారు.
డిసెంబర్లో నిర్వహించనున్న “ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్”లో పాల్గొనాలని ఆగస్టీన్ లీని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా వివరించారు.
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై కూడా ముఖ్యమంత్రి సింగపూర్ ప్రతినిధులకు అవగాహన కల్పించారు. తొలి దశలో మూసీ, ఈసా నదుల సంగమ ప్రాంతం నుంచి గాంధీ సరోవర్ వరకు పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధితో పాటు నైట్ ఎకానమీ ప్రోత్సాహానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు.
హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్గా అభివృద్ధి చేస్తున్నామని, భారత్ ఫ్యూచర్ సిటీని నెట్-జీరో నగరంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటికే హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, ఎంఐటీ, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వంటి అంతర్జాతీయ విద్యాసంస్థలు తమ ఆఫ్షోర్ క్యాంపస్ల ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలపై సానుకూలంగా స్పందించిన సింగపూర్ ప్రతినిధి బృందం, సెమీకండక్టర్ల పరిశ్రమల ఏర్పాటు అంశాన్ని పరిశీలించేందుకు ఆసక్తి ఉన్నట్లు వెల్లడించింది.
ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణారావు, సింగపూర్ మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ దక్షిణాసియా సీనియర్ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ చోంగ్, సింగపూర్ కాన్సుల్ జనరల్ విలియం చిక్ తదితరులు పాల్గొన్నారు.