132 ఏళ్ల తర్వాత లైబ్రరీకి చేరిన మ్యాగజైన్..
132 ఏళ్ల తర్వాత లైబ్రరీకి చేరిన మ్యాగజైన్.. రూ.1.08 కోట్ల జరిమానా తప్పింది!
1894 నాటి మ్యాగజైన్ను తిరిగి ఇచ్చిన 84 ఏళ్ల వ్యక్తి.. అసలు అది తన వద్దకు ఎలా వచ్చిందో తెలియదట
అమెరికా | Ntoday News
అమెరికాలోని న్యూ హాంప్షైర్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 1894 సెప్టెంబర్లో లైబ్రరీ నుంచి తీసుకెళ్లిన ‘ది సెంచరీ ఇలస్ట్రేటెడ్ మంత్లీ మ్యాగజైన్’ ఏకంగా 132 ఏళ్ల తర్వాత తిరిగి లైబ్రరీకి చేరింది. ఈ ఘటనతో లైబ్రరీ సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు.
84 ఏళ్ల బారింగ్టన్ నివాసి జాన్ హాన్సన్ ఈ మ్యాగజైన్ను ఇటీవల కాంకర్డ్ పబ్లిక్ లైబ్రరీకి తిరిగి అందించారు. లైబ్రరీ రికార్డుల ప్రకారం మ్యాగజైన్ 48,220 రోజులుగా తిరిగి ఇవ్వలేదు. అప్పటి జరిమానా లెక్కల ప్రకారం ఆయనపై సుమారు 12,055 అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.10 లక్షలకు పైగా) ఫైన్ పడే అవకాశం ఉండేది. అయితే ప్రస్తుతం లైబ్రరీలో ‘ఫైన్ ఫ్రీజ్’ అమల్లో ఉండటంతో ఎలాంటి జరిమానా విధించలేదు.
హాన్సన్ 1966లో బాస్కోవెన్ నుంచి బారింగ్టన్కు మారుతున్న సమయంలో ఈ మ్యాగజైన్ తన వద్ద ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. అయితే అది తన వద్దకు ఎలా వచ్చిందో ఇప్పటికీ తెలియదని చెప్పారు. దశాబ్దాలుగా అది తమ ఇంట్లోనే ఉందని పేర్కొన్నారు.
మ్యాగజైన్పై కాంకర్డ్ పబ్లిక్ లైబ్రరీ గుర్తులు, ఒక వారం మాత్రమే ఉంచుకోవచ్చనే సూచన కూడా ఉన్నాయి. లైబ్రరీ సిబ్బంది పరిశీలనలో ఇది నిజంగానే 1894లో తీసుకెళ్లిన అసలు కాపీ అని నిర్ధారించారు. మ్యాగజైన్లో కవితలు, వ్యాసాలు, వార్తలతో పాటు అప్పటి ప్రకటనలు కూడా ఉన్నాయి.
లైబ్రరీ ఈ చారిత్రక మ్యాగజైన్ను ఇకపై సాధారణంగా పాఠకులకు ఇవ్వకుండా, కాంకర్డ్ రూమ్లో ప్రదర్శనకు ఉంచాలని భావిస్తోంది.