భారత్-పాక్ నౌకల ఢీకొనడం.. పాక్ దౌత్య ప్రతినిధికి భారత్ సమన్లు
నేషనల్ / Ntoday News: అంతర్జాతీయ జలాల్లో భారత నేవీకి చెందిన ఓ నౌక, పాకిస్థాన్ నేవీ నౌక ఢీకొన్న ఘటనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై పాకిస్థాన్ హైకమిషన్ ఛార్జ్ డి అఫైర్స్ను భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసి, బలమైన నిరసన తెలిపింది.
పాకిస్థాన్ నేవీ నౌక వ్యవహరించిన తీరు “ఆమోదయోగ్యం కానిది, వృత్తిపరమైన ప్రమాణాలకు విరుద్ధమైనది” అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. అంతర్జాతీయ జలాల్లో జరిగిన ఈ ఘటనలో పెద్దగా ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేసింది.
1991 ఏప్రిల్లో భారత్-పాకిస్థాన్ మధ్య కుదిరిన సైనిక విన్యాసాలు, కదలికలకు ముందస్తు సమాచారం ఇచ్చే ఒప్పందంలోని ఆర్టికల్ 10కు పాకిస్థాన్ నేవీ నౌక ప్రవర్తన విరుద్ధంగా ఉందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధిత ఒప్పందాలను గౌరవిస్తూ సైనిక యూనిట్లు తగిన జాగ్రత్తలు పాటించాలని పాక్ అధికారులకు సూచించాలని ఛార్జ్ డి అఫైర్స్కు తెలిపింది.
అదేవిధంగా ఇస్లామాబాద్లోని భారత ఛార్జ్ డి అఫైర్స్ను కూడా పాకిస్థాన్ విదేశాంగ శాఖకు ఇదే అంశంపై నిరసన తెలియజేయాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో భారత నౌకకు పెద్దగా నష్టం జరగలేదని, ఎలాంటి ప్రాణనష్టం కూడా నివేదించలేదని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.