22A భూములపై కొత్త విధానం..
22A భూములపై కొత్త విధానం.. 15 రోజులు అభ్యంతరాలకు అవకాశం: సీఎం రేవంత్
భూములను నిషేధిత జాబితాలో చేర్చే ముందు ఈ-కేవైసీ, ఈమెయిల్, పత్రికా ప్రకటనల ద్వారా సమాచారం
హైదరాబాద్ | Ntoday News
తెలంగాణలో 22A నిషేధిత భూముల అంశంపై ప్రభుత్వం నిర్దేశిత విధానంతో ముందుకు వెళ్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 22A జాబితాలో ఏ భూములను చేర్చాలనే విషయంలో స్పష్టమైన ప్రక్రియను అనుసరిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం 22A భూముల అంశంపై రాష్ట్రంలో చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం ఈ వివరాలను వెల్లడించారు.
22Aలో ఏదైనా భూమిని చేర్చే అధికారం ఆర్డీవో లేదా సబ్ కలెక్టర్లకు ఉంటుందని సీఎం తెలిపారు. సంబంధిత అధికారులు భూ సర్వే నంబర్, పట్టాదారు వివరాలను గుర్తించిన తర్వాతే తదుపరి ప్రక్రియ చేపడతారని పేర్కొన్నారు.
భూమిని నిషేధిత జాబితాలో చేర్చే ముందు ఈ-కేవైసీతో పాటు ఈమెయిల్, పత్రికా ప్రకటనల ద్వారా సమాచారం అందించే విధానం పాటిస్తామని తెలిపారు. సంబంధిత భూయజమానులు అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు 15 రోజుల సమయం ఇస్తామని సీఎం వెల్లడించారు.
అదేవిధంగా అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) భూముల విషయంలోనూ కొత్త విధానం తీసుకురానున్నట్లు సీఎం ప్రకటించారు. 22A జాబితాలో పొరపాటుగా చేర్చిన ప్రైవేట్ భూములను గుర్తించి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు ఇప్పటికే సీఎం, రెవెన్యూ మంత్రి వెల్లడించారు.
22A నిషేధిత జాబితా కారణంగా భూముల రిజిస్ట్రేషన్లు, రుణాలు, ఇతర లావాదేవీలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ పలువురు భూయజమానులు ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకోనున్న కొత్త విధానంపై ఆసక్తి నెలకొంది.