అకాల వర్షాల మోత… రైతులకు భారీ నష్టం
అకాల వర్షాల మోత… రైతులకు భారీ నష్టం – తక్షణ నష్టపరిహారం ఇవ్వాలి: డి. హరినాథ్ డిమాండ్
ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట:
రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాల ప్రభావంతో వరి సహా పలు వాణిజ్య పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, దీంతో రైతులు ఆర్థికంగా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్ ఆందోళన వ్యక్తం చేశారు.
విస్సన్నపేటలో మాట్లాడుతూ, లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట కోత దశకు చేరుకున్న సమయంలో తుఫాన్ ప్రభావంతో పంటలు నాశనం కావడం రైతులకు మానసికంగా కూడా తీవ్ర వేదన కలిగించిందన్నారు. వరి, మొక్కజొన్న, మామిడి, అరటి, మినుము, మిర్చి పంటలు వేల ఎకరాల్లో నష్టపోయినట్లు తెలిపారు.
ప్రతి గ్రామాన్ని యూనిట్గా తీసుకుని, ప్రతి రైతు పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి వెంటనే నష్టపరిహారం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణ సహాయంగా ఎకరాకు రూ.50 వేల చొప్పున ఇవ్వాలని, అలాగే రైతుల రుణాలను పూర్తిగా రద్దు చేయాలని హరినాథ్ కోరారు.