www.ntodaynews.com
భూపాలపల్లి మైన్స్ ఏడీఈ జయరాజ్ ఇంట్లో ఏసీబీ సోదాలు..
తెలంగాణ
/
జయశంకర్ భూపాలపల్లి
భూపాలపల్లి మైన్స్ ఏడీఈ జయరాజ్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. 12 ప్రాంతాల్లో ఏకకాల తనిఖీలు
ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై రంగంలోకి ఏసీబీ అధికారులు
భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీఈ బొజ్జ జయరాజ్ నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్లోని బోడుప్పల్తో పాటు భూపాలపల్లి ప్రాంతంలోని జయరాజ్ నివాసాల్లో గురువారం ఉదయం నుంచి ఏసీబీ బృందాలు సోదాలు చేపట్టాయి. అధికారులు కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
భూపాలపల్లి ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారితో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా జయరాజ్పై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు.
జయరాజ్కు సంబంధించిన హైదరాబాద్, భూపాలపల్లి ప్రాంతాలతో పాటు సూర్యాపేట, తాండూరు తదితర ప్రాంతాల్లో మొత్తం 12 చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సోదాలు పూర్తయిన తర్వాత ఆస్తుల వివరాలు, స్వాధీనం చేసుకున్న పత్రాలపై ఏసీబీ అధికారులు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.