అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత
NTODAY NEWS కొండమల్లేపల్లి
కొండమల్లేపల్లి మండల కేంద్రంలో అక్రమంగా, క్రూరంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వాహన తనిఖీల్లో ఈ అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో కొండమల్లేపల్లి ఎస్సై తన సిబ్బందితో కలిసి గ్రామంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అశోక్ లేలాండ్ వాహనం (టి ఎస్ 05యు సి 2066) అనుమానాస్పదంగా కనిపించడంతో దానిని ఆపి తనిఖీ చేశారు. వాహనంలో నాలుగు పశువులను అత్యంత క్రూరంగా, ఇరుకైన చోట తాళ్లతో కట్టివేసి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆ పశువులకు కనీసం నీరు, ఆహారం కూడా అందించకుండా హింసిస్తూ రవాణా చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
అక్రమ రవాణాకు పాల్పడుతున్న వాహన డ్రైవర్ బొమ్మకంటి రాములు (తండ్రి: తిరుపతయ్య, గ్రామం: చింతపల్లి) మరియు పశువుల యజమాని జంగయ్య (గ్రామం: పోలెపల్లి) పై పోలీసులు కేసు నమోదు చేశారు. రక్షించిన నాలుగు పశువులను సంరక్షణ నిమిత్తం చింతపల్లిలోని శ్రీ సాయి కృష్ణ గోశాలకు తరలించారు.
నిబంధనలకు విరుద్ధంగా పశువులను హింసిస్తూ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.