శింగణమలలో వైఎస్సార్సీపీ జోరు.. టీడీపీకి షాక్
అనంతపురం జిల్లా శింగణమల నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. సింగణమల మండలం రాచేపల్లి గ్రామానికి చెందిన 13 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంపై విశ్వాసంతో పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఈ చేరికలు జరిగినట్లు నాయకులు తెలిపారు.
మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్ నేతృత్వంలో, యువ నాయకుడు డాక్టర్ రుత్విక్ సమక్షంలో, పార్టీ రాష్ట్ర విభాగం కార్యదర్శి గోకుల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కొత్తగా చేరిన కుటుంబాలకు పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన కుటుంబాల సభ్యులు మాట్లాడుతూ, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, ఇచ్చిన హామీలను నెరవేర్చిన నాయకుడిగా ఆయనపై తమకు నమ్మకం ఉందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తితో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో వైఎస్సార్సీపీ పాత్రను గుర్తించి పార్టీలో చేరినట్లు వెల్లడించారు.
రానున్న రోజుల్లో శింగణమల నియోజకవర్గంలో మరిన్ని చేరికలు జరిగే అవకాశం ఉందని వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం గ్రామ స్థాయి నుంచి విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.