పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన.. ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు
పులివెందుల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పులివెందుల పర్యటనలో భాగంగా వేముల మండలం భూమయ్యగారిపల్లెలో నూతనంగా నిర్మించిన గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆలయానికి చేరుకున్న వైఎస్ జగన్కు అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలశ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, సుదర్శన హోమంలోనూ పాల్గొని రాష్ట్ర ప్రజలందరికీ, భక్తులందరికీ స్వామివారి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులు, గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించారు.
అనంతరం వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు ఓబుళరెడ్డి శ్రీరామిరెడ్డి నివాసానికి వెళ్లిన వైఎస్ జగన్, ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన శ్రీరామిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆయన, పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శ్రీరామిరెడ్డి పార్టీ కోసం చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన మరణం వైఎస్సార్సీపీకి తీరని లోటని పేర్కొన్నారు.
పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికారు.