అమరావతి: జూడాల డిమాండ్లపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోండి
అమరావతి: జూడాల డిమాండ్లపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోండి: హైకోర్టు ఆదేశాలు
జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించి విధుల్లో చేరాలని నిర్ణయం తీసుకోవడంపై హైకోర్టు హర్షం వ్యక్తం చేసింది. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని, ప్రజల ప్రాణాలకు సంబంధించిన సేవల్లో అంతరాయం కలగకుండా జాగ్రత్త వహించాలని సూచించింది.
జూడాల న్యాయబద్ధమైన డిమాండ్లపై ప్రభుత్వం రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. నిరసనలు తెలియజేయడం తప్పు కాదని, అయితే వైద్యులు విధులకు దూరంగా ఉండటం వల్ల రోగులు ఇబ్బందులు పడటం సరికాదని ధర్మాసనం పేర్కొంది.
"వైద్యుడు కనిపిస్తేనే రోగికి సగం జబ్బు నయమైన భావన కలుగుతుంది. వైద్య నిపుణుడు తనను చూసుకుంటాడనే నమ్మకం రోగికి భరోసా ఇస్తుంది" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
జూడాల సమ్మె కారణంగా ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలుగుతోందని పేర్కొంటూ ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన సామాజిక కార్యకర్త గూడూరి వెంకట రత్న కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి లీసా గిల్, న్యాయమూర్తి చల్లా గుణరంజన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది యరగొర్ల ఠాగూర్ యాదవ్ వాదిస్తూ.. ఈ నెల 17 నుంచి సమ్మె కారణంగా అత్యవసర వైద్య సేవలు ప్రభావితమయ్యాయని తెలిపారు. వరుసగా రెండు రోజులు విధులకు హాజరు కాకపోతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్టైఫండ్ పెంపుపై చర్చించేందుకు కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. హౌస్ సర్జన్లకు 10 శాతం, పీజీ రెసిడెంట్లు, సూపర్ స్పెషాలిటీ వైద్యులకు 3 శాతం పెంపునకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే జూడాలు 15 శాతం పెంపును కోరుతున్నారని వివరించారు.
జూడాల తరఫు న్యాయవాది భూమా మహర్షి రెడ్డి మాట్లాడుతూ.. పలుమార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మెకు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. అత్యవసర వైద్య సేవలకు జూడాలు అందుబాటులోనే ఉన్నారని కోర్టుకు వివరించారు.
ప్రజలకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటూనే, జూడాల సమస్యలను పరిష్కరించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.