అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం.. విద్యార్థులపై కేసులు, లాఠీచార్జ్ను ఖండించిన సీపీఐ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తిరువూరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం బోసు బొమ్మ సెంటర్ వద్ద యూత్ సంఘాల సభ్యులు కలిసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. పార్లమెంట్లో నీట్కు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి విద్యార్థుల సమస్యలకు చట్టపరమైన పరిష్కారం చూపాలని కోరారు.
ఈ సందర్భంగా విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, శాంతియుత నిరసనల సందర్భంగా పోలీసులు చేపట్టిన లాఠీచార్జ్ను తీవ్రంగా ఖండించారు.
సీపీఐ తిరువూరు నియోజకవర్గ కార్యదర్శి తూము కృష్ణయ్య మాట్లాడుతూ, నీట్ అంశంపై పార్లమెంట్ స్థాయిలో చట్టబద్ధమైన నిర్ణయం తీసుకుని విద్యార్థుల ఆందోళనలను పరిష్కరించాలని కోరారు. శాంతియుత నిరసనలు నిర్వహించిన విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, నమోదైన కేసులన్నింటినీ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో గంపలగూడెం మండల కార్యదర్శి ఎస్కే నాగుల్, తిరువూరు పట్టణ కార్యదర్శి మాలపాటి ఉదయ్, ఎన్టీఆర్ జిల్లా ఏఐవైఎఫ్ అధ్యక్షుడు ఎస్కే సుభాని, పార్టీ నాయకులు, యూత్ సంఘాల ప్రతినిధులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.