అంగన్వాడీ, ఆశా కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
అంగన్వాడీ, ఆశా కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
జూలై 31న చలో కలెక్టరేట్ విజయవంతం చేయాలని సీఐటీయూ పిలుపు
ఎన్టీఆర్ జిల్లా గండేపల్లిలో అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం కార్మికులతో కలిసి జూలై 31న నిర్వహించనున్న "చలో కలెక్టరేట్" కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను సీఐటీయూ నాయకులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు ఎన్.సి.హెచ్. సుప్రజ మాట్లాడుతూ, ఐసీడీఎస్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయినా అంగన్వాడీ సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం కార్మికులుగా గుర్తించలేదన్నారు. తమ పోరాటాల ఫలితంగా గుజరాత్ హైకోర్టు అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వేతనాలు చెల్లించాలని పేర్కొన్నప్పటికీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ వేతనాలు పెంచలేదని విమర్శించారు.
2024లో జరిగిన 42 రోజుల సమ్మె సందర్భంగా అంగన్వాడీ సిబ్బందికి వేతనాలు పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా అమలు చేయలేదన్నారు. కొత్త యాప్లతో అంగన్వాడీలపై అదనపు పనిభారం, మానసిక ఒత్తిడి పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా, మధ్యాహ్న భోజన పథకం, ఇతర స్కీం వర్కర్లకు కూడా కనీస వేతనాలు, పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సంక్షేమ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచడంతో పాటు అన్ని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జూలై 31న విజయవాడ కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని అంగన్వాడీ, ఆశా, ఇతర స్కీం వర్కర్లకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ కంచికచర్ల మండల నాయకుడు గోపినాయక్, నాయకులు జావలేశ్వరి, సౌజన్య, కరుణకుమారి, రాజకుమారి, రోజారాణి, నాగేందమ్మ, బాలకుమారి తదితరులు పాల్గొన్నారు.