అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ
అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ
చిన్నారుల ఆరోగ్యం, గర్భిణుల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ టీచర్ల సేవలను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సాంకేతికతను అందిస్తోంది. ఇందులో భాగంగా నకిరేకల్ పట్టణంలోని గీతా మందిర ఫంక్షన్ హాల్లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా చిట్యాల మండలానికి చెందిన అంగన్వాడీ టీచర్లు ఎమ్మెల్యే వేముల వీరేశం పూలగుచ్చాలతో సాదరంగా ఆహ్వానించి, శాలువాతో ఘనంగా సన్మానించారు. తమ విధుల్లో ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి, డిజిటల్ సాధనాలను అందించడంలో చొరవ చూపినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరచడానికి, డేటా నమోదును సులభతరం చేయడానికి స్మార్ట్ ఫోన్లు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అంగన్వాడి టీచర్లు పడుతున్న శ్రమను ప్రభుత్వం గుర్తించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ అధికారులు మరియు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.