అనకాపల్లిలో పోలీస్ ట్రాన్సిట్ ఫెసిలిటీ ప్రారంభం
అనకాపల్లిలో 'పోలీస్ ట్రాన్సిట్ ఫెసిలిటీ' ప్రారంభం – పాల్గొన్న ఐజీ, కలెక్టర్ మరియు ఎస్పీ
అనకాపల్లి పట్టణం, మే 01, 2026: అనకాపల్లి జిల్లా కేంద్రంలో పోలీస్ అధికారుల సౌకర్యార్థం అత్యాధునిక వసతులతో నిర్మించిన 'పోలీస్ ట్రాన్సిట్ ఫెసిలిటీ' భవనాన్ని ఈరోజు ఘనంగా ప్రారంభించారు. ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ (AMNS) సంస్థ తమ సామాజిక బాధ్యత (CSR) నిధులతో నిర్మించిన ఈ భవనాన్ని విశాఖపట్నం రేంజ్ ఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి, ఐపీఎస్ , జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణ, ఐఏఎస్ మరియు జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ సంయుక్తంగా ప్రారంభించారు.
విశాఖ రేంజ్ ఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి, ఐపీఎస్ మాట్లాడుతూ, కొత్తగా ఏర్పడిన జిల్లాలో మౌలిక వసతుల కల్పన దిశగా ఇది ఒక మంచి పరిణామమని పేర్కొన్నారు. విధుల్లో భాగంగా జిల్లాకు వచ్చే అధికారులకు ఈ భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఇందుకు సహకరించిన AMNS యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీమతి విజయ కృష్ణన్, ఐఏఎస్ మాట్లాడుతూ, అభివృద్ధి కార్యక్రమాల్లో కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యం ప్రశంసనీయమని, పోలీస్ యంత్రాంగానికి మెరుగైన వసతులు కల్పించడం ద్వారా వారి సేవల సామర్థ్యం మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ మాట్లాడుతూ, జిల్లా పోలీసుల సంక్షేమం మరియు పనితీరు మెరుగుపరచడానికి ఇలాంటి వసతులు దోహదపడతాయని తెలిపారు. పోలీస్ శాఖకు నిరంతరం సహకారం అందిస్తున్న అధికారులకు మరియు సంస్థలకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో East AMNS చీఫ్ ప్రాజెక్ట్స్ శ్రీ కె.ఏ.చౌదరి వారి సహధర్మ చారిణితో పాల్గొని, సామాజిక బాధ్యతలో భాగంగా జిల్లా అభివృద్ధికి తమ సంస్థ ఎల్లప్పుడూ తోడ్పాటునందిస్తుందని తెలిపారు.
వీరితో పాటు అడిషనల్ ఎస్పీ (క్రైమ్స్) శ్రీ ఎల్.మోహన్ రావు, ఎస్.బి డీఎస్పీ శ్రీ జీ.ఆర్.ఆర్.మోహన్, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీమతి కె.శ్రావణి, ఇన్స్పెక్టర్లు బాల సూర్యరావు, జి.ప్రేమ్ కుమార్, జి.అశోక్ కుమార్, ఎం.వెంకటనారాయణ, మరియు ఐటీ కోర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.