అసెంబ్లీ ఫైట్.. కేటీఆర్ను ఎత్తిపడేశారు.. సునీతా లక్ష్మారెడ్డి చీర లాగారని ఆరోపణ.. టీషర్ట్ విప్పేసిన హరీశ్ రావు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరగా.. అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పోలీసుల మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారితీసింది.
ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీకి చేరుకున్నారు. అయితే నినాదాలతో ఉన్న టీషర్టులతో అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్లేందుకు పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి అదుపుతప్పకుండా పోలీసులు పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు.
కేటీఆర్ను ఎత్తుకొని కారులోకి..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో హైడ్రామా నెలకొంది. కేటీఆర్ను ఎత్తుకొని పోలీసు వాహనంలోకి ఎక్కించే క్రమంలో ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. పోలీసుల వ్యవహారశైలిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. తమ పట్ల ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయంగా సమాధానం చెబుతామని హెచ్చరించినట్లు పేర్కొన్నాయి.
టీషర్ట్ విప్పేసిన హరీశ్ రావు
మరోవైపు మాజీ మంత్రి హరీశ్ రావు కూడా పోలీసుల తీరుకు నిరసనగా తన టీషర్ట్ విప్పేశారు. ఆయనతో పాటు కేపీ వివేక్, సుధీర్ రెడ్డి కూడా టీషర్టులు విప్పినట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సునీతా లక్ష్మారెడ్డి కన్నీళ్లు..
అసెంబ్లీకి వెళ్తున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో పోలీసులు దురుసుగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో తన చీరను పోలీసులు లాగారని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. మహిళా ప్రజాప్రతినిధి పట్ల ఇలా వ్యవహరించడం ఏమిటంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురికాగా.. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమెను ఓదార్చారు.
తోపులాటలో జగదీశ్ రెడ్డికి గాయం
ఇదే సమయంలో పోలీసులతో జరిగిన తోపులాటలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కాలికి గాయమైనట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందే చోటుచేసుకున్న ఈ పరిణామాలతో అసెంబ్లీ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ విభేదాలు రోడ్డుపైకి రావడంతో అసెంబ్లీ తొలిరోజే తెలంగాణ రాజకీయాల్లో ఈ ఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.