www.ntodaynews.com
ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సు, ర్యాలీ
తెలంగాణ
న్యాయసేవాధికార సంస్థ–ట్రాఫిక్ పోలీస్ సంయుక్తంగా ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సు, ర్యాలీ
NTODAY NEWS : గోదావరిఖని రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా “అరైవ్–అలైవ్” కార్యక్రమంలో భాగంగా భవిష్యత్తులో రోడ్డు ప్రమాద రహిత సమాజం, ప్రమాదాల్లో మరణాల నియంత్రణ లక్ష్యంగా మండల న్యాయసేవాధికార సంస్థ, గోదావరిఖని ట్రాఫిక్ పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు రహదారి భద్రత, న్యాయపరమైన అంశాలు, ట్రాఫిక్ నియమాలపై అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆవరణలో అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి డాక్టర్ టి. శ్రీనివాసరావు, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో జడ్జి మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను ఎలా నివారించవచ్చో వివరించారు. హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగం ప్రాధాన్యత, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, మైనర్లు వాహనాలు నడపడం ద్వారా ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే రోడ్డు ప్రమాదాల సమయంలో చట్టపరమైన హక్కులు, బాధ్యతలపై న్యాయసేవాధికారులు వివరించారు. అనంతరం జడ్జి, పోలీస్ అధికారులతో కలిసి జెండా ఊపి అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి గాంధీ చౌక్ వరకు విద్యార్థులతో కలిసి రహదారి భద్రతపై నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించి, రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
ఏసీపీ మాట్లాడుతూ యుద్ధాల సమయంలో కన్నా నిత్యం జరిగే ర్యాష్ డ్రైవింగ్, మైనర్లు వాహనాలు నడపడం, త్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటివాటి వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. విద్యార్థి దశ నుంచే రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ తమ కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులకూ అవగాహన కల్పించాలని, రోడ్డు భద్రతకు రాయబారులుగా మారి సమాజంలో మార్పుకు దోహదపడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ టి. శ్రీనివాసరావు (అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి), ఐ. సురత్ రాజ్ సింగ్ (సెషన్స్ న్యాయమూర్తి), ఎన్. వెంకట సచిన్ రెడ్డి (ప్రధాన న్యాయమూర్తి), ధ్రువ వెంకటేష్ (ద్వితీయ అదనపు న్యాయమూర్తి), ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రావు, గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ హరిశేఖర్, రామరాజు, లాయర్లు, కోర్టు సిబ్బంది, ప్రభుత్వ మరియు శ్రీ చైతన్య మహర్షి డిగ్రీ కళాశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube