బైండ్ ఓవర్తో నూజివీడు ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు
నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారా నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న నవోదయం–2.0 కార్యక్రమంలో భాగంగా అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ నాగ ప్రభు కుమార్, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి అవులయ్య ఆదేశాల మేరకు నూజివీడు స్టేషన్ పరిధిలోని పాత నేరస్తులను చాట్రాయి తహసిల్దార్, మండల కార్యనిర్వాహక మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి బైండ్ ఓవర్ చేశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ బైండ్ ఓవర్ గడువు ఒక సంవత్సరం పాటు అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ కాలంలో మళ్లీ ఎక్సైజ్ నేరాలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై రూ.1 లక్ష జరిమానా విధించడంతో పాటు ప్రభుత్వ పథకాలు కూడా రద్దు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.
బైండ్ ఓవర్ చేసిన వారిలో పోతనపల్లి పెద్ద తండాకు చెందిన బానావతు పుట్లమ్మ, బనావతు హంస్లి, ధరావతు లక్ష్మి, చిత్తపూరుకు చెందిన బొల్లికొండ సావిత్రి, బొల్లికొండ రమేష్ ఉన్నారు.
ఇదిలా ఉండగా నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఆగిరిపల్లి, నూజివీడు, ముసునూరు, చాట్రాయి మండలాల్లో బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. నాటు సారా తయారీ, విక్రయం, నిల్వ వంటి నేరాలతో పాటు నాటు సారా తయారీలో ఉపయోగించే బెల్లం సరఫరా చేసే వ్యాపారులు, బెల్లపు ఊటలను కలిగి ఉన్న భూ యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.