బీఆర్ఎస్కు మల్లారెడ్డి దూరం.. బీజేపీలో చేరికపై ఊహాగానాలు
బీఆర్ఎస్కు మల్లారెడ్డి దూరం.. బీజేపీలో చేరికపై ఊహాగానాలు
తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సరూర్నగర్లో జరిగిన యువ సంగ్రామ సభతో పాటు కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరుకావడం లేదు.
ఈ నేపథ్యంలో ఇద్దరూ పార్టీకి దూరమవుతున్నారనే చర్చ జరుగుతోంది. పార్టీ నాయకత్వం కూడా వారి వైఖరిపై పెద్దగా స్పందించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, మల్లారెడ్డి కుటుంబ సభ్యులు బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా ఆయన కోడలు బీజేపీ నాయకులతో టచ్లో ఉన్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే, మల్లారెడ్డి లేదా బీజేపీ నుంచి ఈ ప్రచారంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఆయన కుటుంబం బీజేపీలో చేరుతుందా లేదా అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఊహాగానాలకే పరిమితమైంది.