www.ntodaynews.com
బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ వాయుగుండం రానున్న 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ బాలాసోర్ సమీపంలోని చాంద్బలి-దిఘా మధ్య ఉత్తర ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉంది.
ఈ వాయుగుండం ప్రభావంతో వచ్చే 24 గంటల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కూడా పడే అవకాశముంది.
అదేవిధంగా, ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.