బొల్లేరు చెరువు సమీపంలో పెద్దపులి కలకలం.. అప్రమత్తమైన అటవీశాఖ
బొల్లేరు చెరువు సమీపంలో పెద్దపులి కలకలం.. అప్రమత్తమైన అటవీశాఖ
తూర్పుగోదావరి జిల్లాలో కరిచర్లగూడెం–గోపాలపురం గ్రామాల మధ్య బొల్లేరు చెరువు సమీపంలో పెద్దపులి సంచారం స్థానికుల్లో ఆందోళన కలిగించింది. నందిగూడెం అటవీ ప్రాంతం నుంచి తొక్కిరెడ్డిగూడెం, కరిచర్లగూడెం మీదుగా బొల్లేరు చెరువు పరిసరాలకు పెద్దపులి చేరినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.
మార్గమధ్యలో ఒక దూడను చంపి కొబ్బరి, కోకో తోటలోకి లాక్కెళ్లిన ఆనవాళ్లు కనిపించడంతో అధికారులు తోటను పూర్తిగా చుట్టుముట్టారు. పెద్దపులిని సురక్షితంగా బంధించేందుకు మత్తు ఇంజక్షన్, బోను, డ్రోన్ల సాయంతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు.
ఈ ఆపరేషన్లో శ్రీశైలం టైగర్ టీం, తూర్పుగోదావరి జిల్లా హనుమన్ టీంతో పాటు ఉభయగోదావరి జిల్లాల నుంచి వచ్చిన సుమారు 60 మంది అటవీశాఖ సిబ్బంది ఐదు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతాలకు వెళ్లకుండా అధికారుల సూచనలు పాటించాలని అటవీశాఖ విజ్ఞప్తి చేసింది.