బూరుగుగూడెం ప్రాథమికోన్నత పాఠశాలకు 60 స్టీల్ గ్లాస్ల విరాళం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల పరిధిలోని ఎంపీయూపీఎస్ బూరుగుగూడెం పాఠశాల విద్యార్థులకు ప్రతిరోజూ అందించే పోషకాహారమైన రాగి జావ పంపిణీ కోసం 60 స్టీల్ గ్లాస్లను దాతలు విరాళంగా అందించారు.
స్వర్గీయ కనమత రెడ్డి శ్రీధర రెడ్డి స్మారకార్థం కొరప్రోలు సంధ్యారాణి సోమవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ స్టీల్ గ్లాస్లను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంగిడి చెన్నారావు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమం కోసం దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా స్టీల్ గ్లాస్లను అందించిన సంధ్యారాణికి పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బూరుగుగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మాజీ కార్యదర్శి ఉమ్మడి సీతారాములు మాట్లాడుతూ, సమాజ అభివృద్ధికి విద్య ఎంతో ముఖ్యమని, పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావడం సంతోషకరమని అన్నారు. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అందించిన ఈ విరాళం ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఉపాధ్యాయులు ప్రసాద్, కృష్ణ, మణిగోపి దాతలను అభినందించగా, విద్యార్థులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ వారి దాతృత్వ సేవలను కొనియాడారు.