గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు మేలు
ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ
Telangana / Ntoday News: తెలంగాణ ఉద్యమంలో ముందున్నది, జర్నలిస్టుల పక్షాన పోరాటం చేసేది కేవలం ‘టీయూడబ్ల్యూజేహెచ్ 143 యూనియన్ మాత్రమేనని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ లో నిర్వహించిన 'టీయూడబ్ల్యూజే హెచ్ 143' జిల్లా మహా సభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తాను తెలంగాణ ఉద్యమంలో ఉన్నానని, జర్నలిస్టుల బాధలు, సమస్యలు అన్ని తమకు తెలుసని చెప్పారు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జర్నలిస్టుల అన్ని సమ స్యలను పరిష్కరించేందుకు కృషి చేయడం జరిగిందన్నారు. ఉద్యమంలో ఉన్నందున నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టులకు ప్రాధాన్యం ఇచ్చారని, జర్నలిస్టుల సంక్షేమానికి రూ.42 కోట్లు కేటాయించడం జరిగిందని, కరోనా బారినపడ్డ 3900 మందికి ఆర్థిక సహాయం అందించినట్టు గుర్తు చేశారు. ఇక జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల విషయంలో ఎన్నడూ ఇంత గందర గోళ పరిస్థితి నెలకొనలేదని, అధికార యూనియన్ రాష్ట్ర నాయకుల వైఫల్యం కారణంగానే ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, రైల్వే పాసులు, తదితర సమస్యల సాధన కోసం త్వరలోనే ఉద్యమ కార్యచరణ రూపొందించి, జర్నలిస్టుల పక్షాన పోరాడేందుకు ముందుంటామని ఆయన స్పష్టం చేశారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కార విషయంలో ముందుండి పూర్తిస్థాయిలో కృషి చేస్తామని హామీ ఇచ్చారు.