భారత్ అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయి
శ్రీహరికోట, జూలై 6: దేశీయ ప్రైవేట్ అంతరిక్ష రంగంలో చారిత్రాత్మక ఘట్టానికి రంగం సిద్ధమైంది. స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ అభివృద్ధి చేసిన తొలి ప్రైవేట్ ఉపగ్రహ రాకెట్ "విక్రమ్-1"ను జూలై 12 నుంచి ఆగస్టు 4 మధ్య శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), భారత జాతీయ అంతరిక్ష ప్రోత్సాహక, అనుమతి కేంద్రం (ఇన్-స్పేస్) సహకారంతో ఈ ప్రయోగం చేపడుతున్నారు. భారత అంతరిక్ష రంగంలో ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహించనున్న తొలి కక్ష్య ప్రయోగం కావడం విశేషం.
ఈ మిషన్ విజయవంతమైతే దేశీయ ప్రైవేట్ అంతరిక్ష రంగానికి కొత్త ఊపిరి లభించనుండగా, అంతరిక్ష సాంకేతికతలో భారత్ మరో ముందడుగు వేసినట్లవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత ప్రైవేట్ సంస్థల సామర్థ్యాన్ని చాటిచెప్పే కీలక ఘట్టంగా "విక్రమ్-1" ప్రయోగం నిలవనుంది.