భారతరత్న డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను శాఖా గ్రంథాలయంలో బుధవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో భారతరత్న, ప్రముఖ వైద్యుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ వైద్యుడిగా, ప్రజానాయకుడిగా విశేష సేవలందించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారని తెలిపారు. ఆయన వైద్య సేవలకు గుర్తింపుగా ప్రతి ఏడాది జులై 1న ఆయన జయంతిని జాతీయ వైద్యుల దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
దేశానికి ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం 1961లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేసిందని వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు, రాళ్లచర్త రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.