భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. లోతట్టు ప్రాంతాలపై వరద ప్రభావం
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. లోతట్టు ప్రాంతాలపై వరద ప్రభావం
హైదరాబాద్, ఆగస్టు 1: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ముందస్తుగా సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
వరద నీటిమట్టం పెరగడంతో దుమ్ముగూడెం–భద్రాచలం మధ్య రాకపోకలను శుక్రవారం సాయంత్రం నుంచి నిలిపివేశారు. గోదావరి ఉద్ధృతి కారణంగా దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల వద్ద స్నాన ఘట్టాలు, సీతవాగు వద్ద సీతమ్మ నారచీరలు, స్వామివారి సింహాసనం, ఐరన్ ఫుట్ బ్రిడ్జి పూర్తిగా నీటమునిగాయి.
ఇదిలా ఉండగా, కూనవరం వద్ద గోదావరి నీటిమట్టం 19.20 మీటర్లకు చేరగా, పోలవరం వద్ద 11.96 మీటర్ల మేర ప్రవహిస్తోంది. వరద పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైతే వెంటనే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.