భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. బుధవారం నెన్నెల మండలం పుప్పల్వానిపేట గ్రామంలో నిర్వహించిన భూ సర్వే అవగాహన సదస్సుకు ఏడీఎస్ఎల్ఆర్ శ్రీనివాస్, మండల తహసిల్దార్ శ్రీనివాస్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) తదితరులతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ‘భూభారతి’ రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో రికార్డులతో క్షుణ్ణంగా సరిచూసి పరిష్కరిస్తామని చెప్పారు. అర్హులైన రైతులు సరైన పత్రాలతో సర్వేలో పాల్గొనాలని, బోగస్ దరఖాస్తులను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. సమగ్రంగా భూ సర్వే నిర్వహించడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి భూ వివాదాలకు తావుండదని పేర్కొన్నారు.
అంతకుముందు నెన్నెల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్.. సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి, విధుల్లో సమయపాలన పాటించాలని, పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం కొన్నంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లను తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తూ, విద్యార్థుల సంఖ్యను పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కేజీబీవీలో జరుగుతున్న అదనపు తరగతి గదులు, భోజనశాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు