భోగాపురం విమానాశ్రయానికి ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు..
భోగాపురం విమానాశ్రయానికి ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు.. విశాఖకు తొలి విడత చేరిక
విశాఖపట్నం: ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు నగరానికి చేరుకున్నాయి. తొలి విడతగా మూడు బస్సులు గాజువాక డిపోకు చేరాయి. అయితే గాజువాక డిపోలో చార్జింగ్ స్టేషన్, సబ్స్టేషన్ పనులు పూర్తయినప్పటికీ మరికొన్ని ఏర్పాట్లు మిగిలి ఉండటంతో బస్సులను తాత్కాలికంగా స్టీల్ సిటీ డిపోకు తరలించారు.
బస్సులను విశాఖ ప్రాంతీయ మేనేజర్ అప్పలనాయుడు, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ మల్లేశ్వరరావు, అసిస్టెంట్ ఇంజనీర్ ప్రసాద్ తదితర అధికారులు పరిశీలించారు. ఈ నెలాఖరులో మరో ఏడు బస్సులు, ఆగస్టులో మిగిలిన పది బస్సులు చేరనున్నట్లు అధికారులు తెలిపారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మొత్తం 20 ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ఏపీఎస్ఆర్టీసీ ప్రణాళిక రూపొందించింది. సేవలు ప్రారంభానికి ముందు ట్రయల్ రన్లు నిర్వహించనున్నారు.
ఒక మార్గంలో గాజువాక–ఎన్ఏడీ–గురుద్వారా–మద్దిలపాలెం–మధురవాడ–ఆనందపురం మీదుగా భోగాపురం విమానాశ్రయానికి, మరో మార్గంలో గాజువాక–సింధియా–కాన్వెంట్ జంక్షన్–రైల్వే స్టేషన్–ద్వారకా బస్ స్టేషన్–రుషికొండ ఐటీ పార్కు మీదుగా విమానాశ్రయానికి ట్రయల్ రన్లు చేపట్టనున్నారు.
రిజిస్ట్రేషన్, పర్మిట్లు, ఇతర అనుమతుల ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం ఈ బస్సులను విమాన ప్రయాణికుల సేవలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రెండు మార్గాల్లో ప్రత్యేక లాంజ్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.