పెనుగొలను గ్రామ దేవతకు శాకాంబరీ అలంకరణ
పెనుగొలను గ్రామ దేవతకు శాకాంబరీ అలంకరణ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ కు ఆషాడ మాసం సందర్భంగా శుక్రవారం శాకాంబరి అలంకరణ చేశారు. శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి మూలవిరాట్ కు దోస, టమాట, బీర ,బెండ, సొర, చిక్కుడు, ఆలుగడ్డ, క్యారెట్, దొండ, వంకాయ, బీట్ రూట్,, ములగ, కాకర, చేమదుంప, పచ్చిమిర్చి, నిమ్మ, కలే కాయలు దండలు గా కట్టి అలంకరణ చేశారు. అదేవిధంగా గోంగూర, కరేపాకు వంటి ఆకుకూరలు, యాపాకు అమ్మవారు వద్ద ఉంచారు. ముందుగా అర్చకులు దాములురి సత్యనారాయణ శర్మ వేదమంత్రాలతో అమ్మవారికి అభిషేకం చేసి నూతన వస్త్ర అలంకరణ చేసి తదుపరి అమ్మవారికి అష్టోత్తర శతనామావళి పూజ చేశారు . శాకాంబరి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారిని , అమ్మవారి తమ్ముడు పోతురాజు స్వామికీ భక్తులు కొబ్బరికాయలు కొట్టి పసుపు, కుంకుమ, పూలతో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సాయిబాబా కమిటీ సభ్యులు అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం, గారెలు ప్రసాదాలు నివేదన చేసి పంపిణీ చేశారు. అమ్మవారికి శాకాంబరి అలంకరణ కళాకారులు రాళ్లచర్ల జగన్నాథం, పాశం వెంకటేశ్వర్లు చూడ ముచ్చటగా చేశారు. కొంత కాలం నుంచి ఆషాడ మాసంలో గ్రామదేవత ముత్యాలమ్మకు శాకాంబరి అలంకరణ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహణ కమిటీ సభ్యులు ఊటుకూరు నారాయణరావు, కోట దాసు, బొలగాని కోటేశ్వరరావు, యనమద్ది విజయకుమార్ ,కుంచం తిరుపతి రాజు పాల్గొన్నారు.