భువనగిరి మండలం లోని పలు గ్రామాలను సందర్శించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు( MoRD) చెందిన ఉప కార్యదర్శి (RH),డా. మూనా యాస్మిన్
యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి మండలంలోని హన్మపూర్ మరియు తాజ్పూర్ గ్రామాలలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు( MoRD) చెందిన ఉప కార్యదర్శి (RH), డా. మూనా యాస్మిన్ మంగళవారం రోజున పర్యటించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద చేపడుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.హన్మపూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న నీటి సంరక్షణ కుంట (Water Harvesting Pond), నర్సరీ పనులు మరియు అవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమాలను డా. మూనా యాస్మిన్ ప్రత్యక్షంగా సందర్శించి పనుల నాణ్యత, నిర్వహణ విధానం మరియు ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాలలో నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ మరియు హరితాభివృద్ధికి ఈ పనులు ఎంతో దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు.అనంతరం తాజ్పూర్ గ్రామంలో వాగు సమీపంలోని డ్రైనేజ్ లైన్ చివర ఏర్పాటు చేసిన ఇంకుడు గుంత పనులను పరిశీలించి, వర్షపు నీటి సంరక్షణ మరియు భూగర్భ జలాల పెంపుదల దిశగా చేపడుతున్న చర్యలను అభినందించారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు స్థిరమైన అభివృద్ధికి దోహదపడేలా ఉండాలని సూచించారు.ఈ సందర్భంగా ఏరియా ఆఫీసర్ యాప్లో నమోదు చేసిన ఫోటోలను పరిశీలించడంతో పాటు MGNREGS కు సంబంధించిన 7 రిజిస్టర్లను తనిఖీ చేసి, నిర్వహణ విధానం, రికార్డు నిర్వహణ మరియు పారదర్శకతపై సంతృప్తి వ్యక్తం చేశారు. పనుల అమలులో నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరే విధంగా కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు.అదేవిధంగా పోచంపల్లి మండలంలోని గోస్కొండ గ్రామంలో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, NRLM పథకం ద్వారా అందించిన ప్యాడీ క్లీనర్ యంత్రాలను పరిశీలించి అభినందించారు.జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి టి. నాగిరెడ్డి జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, నీటి సంరక్షణ చర్యలు, పర్యావరణ పరిరక్షణ పనులు మరియు గ్రామీణ ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాల గురించి వివరంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేష్, Addl DRDO ( SERP) జంగారెడ్డి,APD నవీన్, తాజ్పూర్ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్, హన్మపూర్ సర్పంచ్ నాయిని సువర్ణ కృష్ణ, గోస్కొండ గ్రామ ఉప సర్పంచ్ బాల్రెడ్డి,ఎంపీడీవో భాస్కర్,ఉపాధి హామీ మరియు సెర్ప్ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.