తిరువూరులో మేకల రవి కుమారి భౌతికకాయానికి ఘన నివాళులు అర్పించిన బుర్రి శ్రీకర్
తిరువూరు పట్టణ సీపీఎం నాయకురాలు మేకల రవి కుమారి భౌతికకాయానికి బీజేపీ ఎస్సీ మోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షుడు శ్రీకర్ బుర్రి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేకల నాగేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చింతలపూడి మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన రవి కుమారికి 38 సంవత్సరాల క్రితం తిరువూరుకు చెందిన ప్రముఖ న్యాయవాది, సీపీఎం నాయకుడు మేకల నాగేంద్ర ప్రసాద్తో వివాహం జరిగింది. అప్పట్లో నాగేంద్ర ప్రసాద్ ప్రముఖ న్యాయవాది, సీపీఎం నాయకుడు సంకురాత్రి జనార్దన్ రావు వద్ద జూనియర్ న్యాయవాదిగా పనిచేశారు. అప్పటి నుంచి రవి కుమారి, నాగేంద్ర ప్రసాద్ దంపతులు సీపీఎం కార్యకర్తలుగా ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. పలు బాధ్యతలు నిర్వహించారు.
ప్రస్తుతం మేకల నాగేంద్ర ప్రసాద్ తిరువూరు కోర్టులో ప్రముఖ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. రవి కుమారి తిరువూరు సీపీఎం పట్టణ కమిటీతో పాటు మహిళా మండలి సభ్యురాలిగా పనిచేస్తూ ప్రజలకు సేవలందించారు.
గత మూడు నెలలుగా కాలేయ సంబంధిత సమస్యతో మంగళగిరిలోని నాగార్జున ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవి కుమారి శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు తీవ్ర విషాదానికి లోనయ్యారు.
తిరువూరులోని ఆమె స్వగృహంలో ఉంచిన భౌతికకాయాన్ని వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ‘కామ్రేడ్ రవి కుమారి జోహార్’ అంటూ ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రి అంబులెన్స్ ద్వారా రవి కుమారి పార్థివదేహాన్ని ఎన్ఆర్ఐ వైద్య కళాశాలకు దానం చేశారు. మరణానంతరం తమ శరీరం వైద్య విద్యకు, వైద్య పరిశోధనలకు ఉపయోగపడేలా భార్యాభర్తలు ముందుగానే తీసుకున్న నిర్ణయాన్ని పలువురు అభినందించారు. మానవత్వంతో కూడిన ఈ నిర్ణయం ద్వారా రవి కుమారి కుటుంబం ఆదర్శంగా నిలిచిందని పలువురు కొనియాడారు.
ఈ సందర్భంగా విసన్నపేట సీపీఎం నాయకురాలు బుర్రి మేరీ కుమారి, విసన్నపేట సీపీఎం నాయకుడు నాగరాజు తదితరులు మేకల నాగేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.