చాట్రాయి దివంగత ఏ ఎస్సై కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా ఎస్పీ
ఏలూరు జిల్లా చాట్రాయి పోలీస్ స్టేషన్లో ఏ.ఎస్సైగా విధులు నిర్వహిస్తూ అనారోగ్య కారణాలతో ఏప్రిల్ 2, 2026న మరణించిన వంగాల మాధవ రెడ్డి కుటుంబానికి జిల్లా పోలీస్ శాఖ అండగా నిలిచింది. సోమవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ దివంగత మాధవ రెడ్డి భార్య సుజాతకు పోలీస్ అధికారుల సంఘం తరఫున రూ.1 లక్ష చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మాధవ రెడ్డి కుటుంబానికి ఇప్పటికే ఫ్లాగ్ ఫండ్ నుంచి రూ.25 వేలు, విడో ఫండ్ నుంచి రూ.50 వేల చెక్కులను అందజేసినట్లు తెలిపారు. పోలీస్ శాఖకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన మరణం శాఖకు తీరని లోటని పేర్కొన్నారు.
ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రాయితీలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాలు కల్పించేందుకు సిఫార్సు చేస్తామని తెలిపారు. అవసరమైతే తమను నేరుగా కలవవచ్చని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఆర్. నాగేశ్వరరావు, పోలీస్ ప్రధాన కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.