చాట్రాయి మండలంలో ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన....
చాట్రాయి మండలంలో ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన.. పొలం పిలుస్తోంది కార్యక్రమం
చాట్రాయి మండల రిపోర్టర్ గోళ్ళ సత్యనారాయణ
చాట్రాయి మండలంలోని పోలవరం, పోతనపల్లి గ్రామాల్లో రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో “పొలం పిలుస్తోంది” కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎల్నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. డిమాండ్ ఆధారిత పంటల సాగు, మల్చింగ్ విధానం ద్వారా తక్కువ నీటితో పంటలను సాగు చేసుకునే విధానాలను వివరించారు.
వర్షాభావ పరిస్థితులను అంచనా వేసుకుని ఆరుతడి పంటలైన జొన్న, మినుము, పెసర, వేరుశెనగ, నువ్వులు సాగు చేసుకోవచ్చని తెలిపారు. నీటి ఎద్దడి ఉన్న పొలాలు, తోటల్లో అంతర పంటగా నవధాన్యాలు సాగు చేయడం ద్వారా ఏడాది పొడవునా భూమిని పంటతో కప్పి ఉంచవచ్చని, దీనివల్ల నేలలో సేంద్రీయ పదార్థాలు పెరిగి భూసారాన్ని మెరుగుపరచవచ్చని వివరించారు.
ఫార్మర్ యాప్ ద్వారా పంటల నమోదు విధానాన్ని రైతులకు తెలియజేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద వరి పంటకు బీమా చెల్లించేందుకు ఆగస్టు 31 చివరి తేదీ అని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆరుతడి పంటల సాగులో యాజమాన్య పద్ధతులు, నీటి వనరుల పొదుపు, డ్రిప్ ఇరిగేషన్ ప్రయోజనాలు, ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే లాభాలను వివరించారు. జీవామృతం తయారీ విధానాన్ని ప్రదర్శన ద్వారా రైతులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల ఉద్యాన శాఖ అధికారి ఆర్.హేమ, మండల వ్యవసాయ అధికారి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు.