దేశంలో చక్కెర కొరత.. దిగుమతులపై ఆధారపడుతున్న భారత్
దేశంలో చక్కెర కొరత.. దిగుమతులపై ఆధారపడుతున్న భారత్
రెడ్ ర్యాట్ వ్యాధి, ఎల్నినో ప్రభావంతో తగ్గిన ఉత్పత్తి
పెరుగుతున్న చక్కెర రిటైల్ ధరలు.. కేంద్రం చర్యలు
న్యూఢిల్లీ: దేశంలో చక్కెర కొరత ఏర్పడినట్టు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. చక్కెర ధరలు పెరుగుతుండటంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
రెడ్ ర్యాట్ వ్యాధి, ఎల్నినో ప్రభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తులు తగ్గాయని, దాని ప్రభావం చక్కెర ఉత్పత్తిపైనా పడిందని మంత్రి వెల్లడించారు. దేశంలో ప్రతి ఏడాది సుమారు 280 లక్షల టన్నుల చక్కెర అవసరం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో 20 నుంచి 25 లక్షల టన్నుల వరకు అదనపు చక్కెర నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు.
భారీగా పెరుగుతున్న చక్కెర ధరలు
కేంద్రం చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ మార్కెట్లో చక్కెర ధరలు పెరుగుతున్నాయి. జూలై 20న కిలో చక్కెర ధర రూ.48.18 ఉండగా.. ఆగస్టు 20 నాటికి రూ.55.70కు చేరింది. తక్కువ వ్యవధిలో ఇంత భారీగా ధరలు పెరగడం ఇదే మొదటిసారి అని నివేదికలు పేర్కొంటున్నాయి.
ఈ ధరల పెరుగుదలపై కాంగ్రెస్ ఎంపీ రణ్దీప్ సింగ్ సుర్జేవాలా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. చెరుకు రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో రైతులు చెరుకు సాగు తగ్గించారని ఆరోపించారు. ఏడాది పాటు రైతులకు బకాయిలు చెల్లించకపోతే వారు అదే పంటను ఎలా సాగు చేస్తారని ప్రశ్నించారు.
ఒకప్పుడు భారత్ చక్కెరను ఎగుమతి చేసే స్థాయిలో ఉండేదని, ఇప్పుడు చరిత్రలో తొలిసారి దిగుమతులు చేసుకునే పరిస్థితి వచ్చిందని సుర్జేవాలా విమర్శించారు.