దేశవ్యాప్తంగా పెరుగుతున్న స్వైన్ఫ్లూ కేసులు..
దేశవ్యాప్తంగా పెరుగుతున్న స్వైన్ఫ్లూ కేసులు.. హెచ్1ఎన్1 కొత్త వేరియంట్ లేదన్న ఐసీఎంఆర్
న్యూఢిల్లీ, ఆగస్టు 23: దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో స్వైన్ఫ్లూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కీలక ప్రకటన చేసింది. హెచ్1ఎన్1 వైరస్కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి కొత్త వేరియంట్ను గుర్తించలేదని స్పష్టం చేసింది.
కాలానుగుణ ఇన్ఫ్లుయెంజా జ్వరాల్లో భాగమైన హెచ్1ఎన్1 సాధారణంగా స్వీయ పరిమిత వ్యాధిగా ఉంటుందని ఐసీఎంఆర్ తెలిపింది. జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒంటినొప్పులు ఈ వ్యాధి ప్రధాన లక్షణాలని పేర్కొంది.
అయితే చిన్నారులు, వృద్ధులు, ఇప్పటికే ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు స్వైన్ఫ్లూతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇలాంటి వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఢిల్లీలో ఈ ఏడాది ఇప్పటివరకు 2,300 ఇన్ఫ్లుయెంజా కేసులు నమోదయ్యాయి. వీటిలో శుక్రవారం నాటికి 1,777 కేసులు హెచ్1ఎన్1గా నిర్ధారణ అయ్యాయి. ఒక్క గురువారమే 114 హెచ్1ఎన్1 కేసులు నమోదవడం ఆందోళనకు కారణమైంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.