తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు.. 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు.. 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం.. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
బుధవారం నుంచి తగ్గనున్న వర్షాల తీవ్రత
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని తెలిపింది.
అల్పపీడనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంగళవారం కూడా రాష్ట్రంలోని దాదాపు 22 జిల్లాల్లో ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని అంచనా వేశారు.
ఆదిలాబాద్ నుంచి కామారెడ్డి వరకు అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. బుధవారం నుంచి వర్షాల తీవ్రత క్రమంగా తగ్గుతుందని, ఆ తర్వాత మూడు రోజుల పాటు ఎలాంటి హెచ్చరికలు లేవని అధికారులు తెలిపారు.
రైతులు వాతావరణ సూచనలను గమనిస్తూ పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
హైదరాబాద్ నగరంలో రానున్న 48 గంటల పాటు ఆకాశం మేఘావృతంగా ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం వరకు హైదరాబాద్లో గరిష్టంగా 32.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, 26 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయిందని, గాలిలో తేమ శాతం 92గా ఉన్నట్లు వెల్లడించారు.