చాట్రాయి మండలంలో పదో తరగతి ఫలితాలు విడుదల 79 శాతం ఉత్తీర్ణత నమోదు
చాట్రాయి, ఏప్రిల్ 30: పదో తరగతి ఫలితాలు విడుదలైన నేపథ్యంలో చాట్రాయి మండలంలో మంచి ఫలితాలు నమోదయ్యాయి. మండలంలోని ఏడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో మొత్తం 293 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 236 మంది ఉత్తీర్ణత సాధించారు. దీంతో మండల ఉత్తీర్ణత శాతం 79గా నమోదైనట్లు ఎంఈఓ-1 మాసగిరి శ్రీనివాస్ తెలిపారు.
మండలంలో చిన్నంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన అడ్డగట్ల కవిత 580 మార్కులతో ప్రథమ స్థానం సాధించింది. అదే పాఠశాలకు చెందిన పరసా మధులత 575 మార్కులతో ద్వితీయ స్థానం, చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎం. జస్వంత్ 574 మార్కులతో తృతీయ స్థానం పొందారు.
ఇక మండలంలోని 7 పాఠశాలల్లో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 45 మందికి పైగా ఉన్నారని, వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు ఎంఈఓ1 మాసగిరి శ్రీనివాస్ పేర్కొన్నారు.