ద్వారకాతిరుమలలో గేదె చోరీ కేసు ఛేదన.. ఇద్దరు నిందితుల అరెస్ట్
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలో సంచలనం సృష్టించిన గేదె చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు, దొంగిలించిన గేదెతో పాటు దానికి జన్మించిన దూడను కూడా సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు.
గత జూలై 13వ తేదీ రాత్రి గుండుగొలనుగుంట గ్రామానికి చెందిన జంగా నాగేశ్వరరావుకు చెందిన పామాయిల్ తోటలో కట్టివుంచిన చూడి గేదెను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ ప్రసాదరావు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో, భీమడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. కృష్ణ ఆధ్వర్యంలో ద్వారకాతిరుమల ఎస్ఐ టి. సుధీర్ ప్రత్యేక బృందంతో విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడుకు చెందిన దిర్శిపాము వెంకట సుబ్బారావు (24), సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం ఏపూరుకు చెందిన ఎరకల సౌమ్య (24)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితులు దొంగిలించిన గేదెను తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం నసీంపేట గ్రామంలో దాచిపెట్టినట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి గేదెతో పాటు దానికి జన్మించిన దూడను స్వాధీనం చేసుకున్నారు. అలాగే దొంగిలించబడిన గేదెను తన వద్ద ఉంచుకున్న నసీంపేట గ్రామానికి చెందిన విజయకాంత్ పాత్ర కూడా దర్యాప్తులో వెలుగులోకి రావడంతో అతనిపై కూడా కేసు నమోదు చేశారు.
కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన ఎస్ఐ టి. సుధీర్తో పాటు హెడ్ కానిస్టేబుల్ దుర్గారావు, పోలీస్ కానిస్టేబుల్ శివకృష్ణ, హోంగార్డు జయప్రకాష్ బాబు సేవలను జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.