సైబర్ మోసాల బాధితులకు భరోసా.. రూ.44,465 రికవరీ చేసి అందజేసిన ఏలూరు సైబర్ క్రైమ్ పోలీసులు
ఏలూరు, జూలై 31: ఆన్లైన్ మోసాలు, డిజిటల్ లావాదేవీల్లో సాంకేతిక లోపాల కారణంగా డబ్బులు కోల్పోయిన బాధితులకు ఏలూరు జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి అండగా నిలిచారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు బాధితులకు మొత్తం రూ.44,465 రికవరీ చేసి అందజేశారు.
సైబర్ నేరాల నియంత్రణతో పాటు బాధితుల సొమ్మును తిరిగి రాబట్టేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ కేసులను వేగంగా పరిష్కరిస్తున్నారు. ఈ క్రమంలో డిజిటల్ లావాదేవీల్లో పొరపాటున ఇతరుల ఖాతాలకు జమ అయిన నగదు, అలాగే ఆన్లైన్ మోసాలకు గురైన బాధితుల ఫిర్యాదులను పరిశీలించి సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ దాసు ఆధ్వర్యంలోని బృందం సమర్థవంతంగా చర్యలు చేపట్టింది.
ఈ చర్యల్లో భాగంగా బాధితులకు రూ.18,955 నగదును రికవరీ చేసి నేరుగా అందజేశారు. మరోవైపు మనీ రెస్టోరేషన్ మాడ్యూల్ ద్వారా బ్యాంకుల సహకారంతో హోల్డ్లో ఉన్న రూ.25,510ను విడుదల చేసి బాధితుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయించారు. ఇలా ఒక్కరోజులోనే మొత్తం రూ.44,465 బాధితులకు తిరిగి అందింది.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ దాసు మాట్లాడుతూ డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపే లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాలు, యూపీఐ పిన్ వంటి గోప్య సమాచారాన్ని ఎవరికీ తెలియజేయవద్దని హెచ్చరించారు.
సైబర్ మోసాలకు గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలని లేదా సమీప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు. వెంటనే ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదును రికవరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.