చాట్రాయిలో అకాల వర్షాలతో మొక్కజొన్న పంటకు నష్టం
చాట్రాయిలో అకాల వర్షాలతో మొక్కజొన్న పంటకు నష్టం రైతులు అప్రమత్తంగా ఉండాలన్న వ్యవసాయాధికారి
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలంలోని చాట్రాయి, చనుబండ గ్రామాల్లో మొక్కజొన్న పంటను మండల వ్యవసాయాధికారి బి. శివశంకర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
మండలంలో రబీ సీజన్కు గాను సుమారు 12,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరగగా, ఈ నెల 18వ తేదీ సాయంత్రం కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో చాట్రాయి, చనుబండ గ్రామాల్లో సుమారు 50 ఎకరాల మేర పంట నేలకొరిగినట్లు ఆయన తెలిపారు.
పొలాల్లో నిల్వైన నీటిని కాలువల ద్వారా బయటకు పంపించి, మొక్కజొన్న కాండాలకు తేమ తగలకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరో వారం రోజుల్లో పంట కండేలు పూర్తిగా ఎండే దశకు చేరుకునే అవకాశం ఉన్నందున, కోతకు సిద్ధంగా ఉండాలని రైతులకు సూచించారు.
ఎండ తీవ్రత పెరిగే క్రమంలో అధిక యూరియా వినియోగం లేదా నేలలోని శిలీంద్రాల కారణంగా ఆకు, కాండం ఎండు తెగుళ్లు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. నివారణ చర్యగా అజోక్సిస్ట్రోబిన్ 11% + టేబుకోనజోల్ 18.3% మిశ్రమాన్ని ఎకరానికి 300 మిల్లీలీటర్ల మేర పిచికారీ చేయాలని సూచించారు.
ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చని వ్యవసాయాధికారులు పేర్కొన్నారు.