చాట్రాయిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
చాట్రాయిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
చాట్రాయి, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చాట్రాయి మండలంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు పనపల సురేష్ ఆదేశాల మేరకు చనుబండ గ్రామానికి చెందిన బీజేపీ ఏలూరు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బుర్రి శ్రీకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా నూజివీడు పురపాలక సంఘ కార్యాలయంలో మహిళలను చీరలు, మెమెంటోలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బుర్రి శ్రీకర్ మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా సమాజంలోని అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. మహిళా సాధికారత లేకుండా సమాజ అభివృద్ధి సాధ్యం కాదని ఆయన అన్నారు.
మహిళలు విద్య, ఉపాధి, రాజకీయాలు, క్రీడలు వంటి రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారని, ఏ లక్ష్యాన్నైనా సాధించే తపన మహిళల్లో ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా పారిశుద్ధ్య మహిళా సిబ్బంది చేస్తున్న సేవలను అభినందిస్తూ, వారి పనితనం వల్లే గ్రామాలు పరిశుభ్రంగా ఉంటున్నాయని కొనియాడారు.
శరణాల మాలతీరాణి మాట్లాడుతూ మహిళ చదువుకుంటే ఒక కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఏ లక్ష్యాన్నైనా సులభంగా సాధించగలరని అన్నారు.
జిల్లా అధ్యక్షుడు చౌటపల్లి విక్రమ్ కిషోర్ మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానులని, పిల్లలకు మొదటి గురువు తల్లేనని పేర్కొన్నారు. సమాజంలో మార్పు రావాలంటే ముందుగా మహిళల్లో మార్పు రావాలని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా మహిళలు లాభపడుతున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నూజివీడు మున్సిపల్ కమిషనర్ కె. పేరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి నగడపాటి సత్యనారాయణ, పట్టణ అధ్యక్షురాలు మల్లిపూడి నాగరాణి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఇలపర్తి కుసుమ కుమారి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.