చీరతో కట్టి.. సెంట్రింగ్ కర్రతో దాడి.. భర్తను హతమార్చిన భార్య
హైదరాబాద్ పీర్జాదిగూడలో దారుణ ఘటన
హైదరాబాద్ : పీర్జాదిగూడలో సంచలనం రేపిన భర్త హత్య కేసులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. రాఘవేంద్ర కాలనీకి చెందిన సత్యనారాయణ (51), ఆయన భార్య సునీత (44) మధ్య ఆగస్టు 6న తీవ్ర వాగ్వాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో సునీత తన భర్త చేతులు, కాళ్లను చీరతో కట్టి సెంట్రింగ్ కర్రతో దాడి చేసినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం వాహనం నుంచి జారి పడటంతో గాయాలయ్యాయని కుమారుడికి చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించిన సత్యనారాయణ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఘటనపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల పరిశీలనతో పాటు కుటుంబ సభ్యులను విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితురాలు సునీతను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.