చెన్నైలో దారుణం.. మహిళను చంపి ముక్కలుగా నరికి శరీర భాగాలు తరలింపు
చెన్నైలో దారుణం.. మహిళను చంపి ముక్కలుగా నరికి శరీర భాగాలు తరలింపు
సూట్కేస్ మిస్టరీ ఛేదించిన పోలీసులు.. 350 సీసీ కెమెరాలతో నిందితుల గుర్తింపు
చెన్నై: తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలులో లభ్యమైన గుర్తుతెలియని సూట్కేస్ కేసులో భయానక నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఒడిశాకు చెందిన మహిళను హత్య చేసి, ఆమె శరీర భాగాలను సూట్కేస్లో పెట్టి రైలులో వదిలేసిన ఘటన సంచలనం సృష్టించింది.
ఆగస్టు 5న జరిగిన ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా రైల్వే స్టేషన్కు చేరుకున్న తమిళనాడు ఎక్స్ప్రెస్లోని ఎరుపు రంగు సూట్కేస్ నుంచి దుర్వాసన రావడంతో ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. సూట్కేస్ను పరిశీలించిన పోలీసులు అందులో నరికిన మానవ శరీర భాగాలను గుర్తించారు.
విచారణలో ఆ సూట్కేస్ను చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో రైలులో పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. కేసును ఛేదించేందుకు స్టేషన్ పరిసరాల్లోని దాదాపు 350 సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. ఒక మహిళ, పురుషుడు కలిసి సూట్కేస్తో స్టేషన్కు వచ్చిన దృశ్యాలు బయటపడ్డాయి.
గూడువాంచేరి ఇంట్లో కీలక ఆధారాలు
సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు చెన్నై పార్క్ స్టేషన్ నుంచి స్థానిక రైలులో గూడువాంచేరికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ వారు ప్రయాణించిన ఆటోను గుర్తించి, చివరకు మసీదు వీధిలోని అద్దె ఇంటికి చేరుకున్నారు.
ఇంట్లో రక్తపు మరకలు, హత్యకు సంబంధించిన ఆధారాలు లభించడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్య అనంతరం ఆధారాలు లేకుండా చేసేందుకు మృతదేహాన్ని ముక్కలుగా చేసి, కొన్ని భాగాలను సూట్కేస్లో పెట్టినట్లు దర్యాప్తులో తేలింది.
మిగిలిన శరీర భాగాలను మైదా పిండి, కూరగాయలతో కలిపి పెద్ద పాత్రలో ఉడికించినట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలి తల కోసం గాలింపు కొనసాగుతోంది.
మృతురాలు ఒడిశాకు చెందిన హయత్ నిషా
మృతురాలిని ఒడిశాకు చెందిన హయత్ నిషాగా పోలీసులు గుర్తించారు. భర్త నుంచి విడిపోయిన ఆమె తాంబరంలోని ఓ ఎగుమతి సంస్థలో పనిచేస్తున్నట్లు తెలిసింది. ఆమె కుమారుడు ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నాడు.
నిషా, మాణిక్ ఉత్తిన్–లస్కర్ దంపతులతో కలిసి నివసిస్తున్నట్లు సమాచారం. తనకు మాణిక్ ఉత్తిన్ తమ్ముడు అవుతాడని ఆమె చుట్టుపక్కల వారికి చెప్పినట్లు తెలుస్తోంది.
డబ్బు, నగల కోసమే ఈ హత్య జరిగిందా? లేక మరేదైనా కారణమా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.