చెరువుల్లో వినాయక నిమజ్జనానికి హైడ్రా అడ్డంకి కాదు: రంగనాథ్
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన హైడ్రా కమిషనర్.. అమీన్పూర్, కాప్రా వంటి ప్రత్యేకంగా గుర్తించిన చెరువుల వద్ద మాత్రమే ఆంక్షలు
హైదరాబాద్ | Ntoday News
హైదరాబాద్ నగర పరిధిలోని చెరువుల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి హైడ్రా ఎలాంటి అడ్డంకులు సృష్టించడం లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. నిమజ్జనాలకు హైడ్రా వ్యతిరేకమంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీలు అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించిన పర్యావరణపరంగా సున్నితమైన కొన్ని చెరువుల వద్ద మాత్రమే నిబంధనల కారణంగా పరిమితులు ఉన్నాయని రంగనాథ్ తెలిపారు. అమీన్పూర్ చెరువును బయోడైవర్సిటీ ప్రాంతంగా, కాప్రా చెరువును నేచురల్ వెట్ల్యాండ్గా గుర్తించిన నేపథ్యంలో అక్కడ ప్రత్యేక జాగ్రత్తలు అవసరమని వివరించారు.
అయితే హైడ్రా పునరుద్ధరణ, సుందరీకరణ పనులు చేపడుతున్న మిగతా చెరువుల్లో వినాయక నిమజ్జనాలకు ఎలాంటి సాధారణ నిషేధం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రధాన నీటి వనరులకు నష్టం కలగకుండా, భక్తులు మరియు ఉత్సవ కమిటీలకు ఇబ్బందులు లేకుండా నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
చిన్న విగ్రహాల నిమజ్జనం కోసం అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యేకంగా బేబీ పాండ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు రంగనాథ్ వెల్లడించారు. కాప్రా, ఉప్పల్, ఐడీపీఎల్ వంటి ప్రాంతాల్లో కూడా నిమజ్జనాలకు అనువుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా, పర్యావరణహితంగా జరిగేలా ప్రజలు, ఉత్సవ కమిటీలు సహకరించాలని హైడ్రా కమిషనర్ కోరారు.