స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఘట్కేసర్లో కాంగ్రెస్ ఆత్మగౌరవ ప్రదర్శన
రాజ్యాంగబద్ధమైన పదవికి గౌరవం ఇవ్వాలి: తోటకూర వజ్రేష్ యాదవ్
ఘట్కేసర్ | Ntoday News
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘట్కేసర్లో ‘ఆత్మగౌరవ ప్రదర్శన’ నిర్వహించారు. స్పీకర్పై వ్యాఖ్యల వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
పోచారం 8వ డివిజన్ పరిధిలోని చౌదరిగూడలో పోచారం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్రె రాజేష్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్చార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన శాసనసభ స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగ విలువలను అవమానించడమేనని అన్నారు. అత్యున్నతమైన స్పీకర్ పదవికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపై ఉందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థలో హుందాతనం, సభా గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని వజ్రేష్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజల పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి, ఘట్కేసర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపావుల వినోద్ కుమార్, 6వ డివిజన్ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ రెడ్డి, ఘట్కేసర్ మండల మాజీ వైస్ ఎంపీపీ కర్రె జంగమ్మ, మహిళా కాంగ్రెస్ నాయకులు బండ్లగూడ వాణి నగేష్ గౌడ్, ఎర్ర మాధవి రాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.