చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రమాదకర పరిస్థితి
డివిజన్ రిపోర్టర్ అమెర్ల ధర్మా రావు
ప్రధాన గేటు వద్ద భారీ గొయ్యి.. నాలుగు రోజులైనా పట్టించుకోని అధికారులు
ఏలూరు జిల్లా చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద ఏర్పడిన భారీ గొయ్యి ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతోంది. నాలుగు రోజులుగా ఈ గొయ్యి అలాగే ఉన్నప్పటికీ అధికారులు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సేవల కోసం వచ్చే 108 అంబులెన్సులు కూడా ఆసుపత్రి ఆవరణలోకి సులభంగా ప్రవేశించలేని పరిస్థితి నెలకొంది. దీంతో అత్యవసర వైద్య సేవలు ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
చింతలపూడి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నప్పటికీ, ప్రభుత్వ ఆసుపత్రి వంటి కీలక కేంద్రంలో కనీస నిర్వహణ లోపించడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తోందని ప్రజలు విమర్శిస్తున్నారు.
ప్రధాన గేటు వద్ద ఉన్న గొయ్యిని వెంటనే పూడ్చి, రోగుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.