చింతలపూడి–రేచర్ల బొగ్గు గనుల్లో రిలయన్స్ ఎంట్రీ..
చింతలపూడి–రేచర్ల బొగ్గు గనుల్లో రిలయన్స్ ఎంట్రీ.. లక్ష కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్టు.. వేలాది ఉద్యోగాలకు మార్గం
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా, చింతలపూడి: చింతలపూడి–రేచర్ల బొగ్గు గనుల అభివృద్ధికి భారీ పెట్టుబడులు రానున్నాయి. కేంద్ర బొగ్గు శాఖ నిర్వహించిన తాజా వేలంలో చింతలపూడి, రేచర్లకు చెందిన రెండు బొగ్గు బ్లాకులను రిలయన్స్ ఇండస్ట్రీస్ దక్కించుకున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో భూగర్భ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక వివరాలను రిలయన్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి వివరించినట్లు సమాచారం. చింతలపూడి, రేచర్ల ప్రాంతాల్లో కలిపి 3,130 మిలియన్ టన్నులకు పైగా బొగ్గు నిల్వలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. సుమారు 600 మీటర్ల లోతులో ఉన్న బొగ్గు నిల్వలను ఆధునిక సాంకేతికతతో వెలికితీసేలా ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
భూగర్భ కోల్ గ్యాసిఫికేషన్ విధానంతో బొగ్గును నేరుగా భూగర్భంలోనే వాయువుగా మార్చి వినియోగించే అత్యాధునిక సాంకేతికతను ఈ ప్రాజెక్టులో అమలు చేయనున్నారు. దీంతో పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడంతో పాటు ఇంధన ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరిగే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అమలులోకి వస్తే వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. నిర్మాణ దశలోనే స్థానికులకు ఉద్యోగాలు, రవాణా, యంత్రాల నిర్వహణ, అనుబంధ పరిశ్రమల్లో విస్తృత అవకాశాలు ఏర్పడనున్నాయని భావిస్తున్నారు.
దేశంలోనే తొలి భారీ స్థాయి అండర్గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుగా దీనిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనులు చేపట్టనున్నట్లు సమాచారం. 2029 నాటికి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు అమలైతే ఏలూరు జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ఊపు రావడంతో పాటు చింతలపూడి ప్రాంత ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.