చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
243 అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్ల పంపిణీ
మైలవరం, జూలై 7: చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు అన్నారు. మైలవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని నాలుగు మండలాల్లోని 243 అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన ఇండక్షన్ స్టవ్లను మంగళవారం ఆయన పంపిణీ చేశారు.
మైలవరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఇండక్షన్ స్టవ్లను అందజేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారాన్ని మరింత పరిశుభ్రంగా, సురక్షితంగా తయారు చేయడానికి ఈ స్టవ్లు ఉపయోగపడతాయని తెలిపారు.
చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, అందుకు అనుగుణంగా అంగన్వాడీ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తూ చిన్నారుల భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు.
కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పిల్లలకు మెరుగైన సేవలు అందించాలని సూచించిన ఆయన, ఇండక్షన్ స్టవ్ల వినియోగంతో వంట ప్రక్రియ వేగవంతమవడంతో పాటు ఇంధన వినియోగం తగ్గి, పరిశుభ్రమైన వాతావరణంలో ఆహార తయారీ సాధ్యమవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), ఐసీడీఎస్ అధికారులు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, పార్టీ నాయకులు, కూటమి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.